నెలకు రూ.లక్ష ఆదాయం.. క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్

  • క్యాబ్ డ్రైవర్‌తో సీఈవో సంభాషణ వైరల్
  • గతంలో రూ.25 వేల జీతంతో ఉద్యోగం చేసిన డ్రైవర్
  • ప్రస్తుతం నెలకు దాదాపు రూ.లక్ష రూపాయల ఆదాయం
  • డ్రైవర్‌ను వ్యాపారవేత్తగా అభివర్ణించిన సీఈవో
  • వాహనమే అతని వ్యాపార కేంద్రం అని వ్యాఖ్య
ఉద్యోగం కంటే సొంతంగా పనిచేస్తే ఎక్కువ ఆదాయం సంపాదించవచ్చని చెబుతూ ఓ క్యాబ్ డ్రైవర్‌తో కంపెనీ సీఈవో జరిపిన సంభాషణ సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోలో ఉద్యోగం నుంచి స్వయం ఉపాధి వైపు మళ్లిన ఓ వ్యక్తి అనుభవాలను పంచుకోవడం ఆసక్తి కలిగిస్తోంది.

గురుగ్రామ్‌కు చెందిన జిప్ ఎలక్ట్రిక్ సంస్థ వ్యవస్థాపకుడు, సీఈవో ఆకాష్ గుప్తా క్యాబ్‌లో ప్రయాణిస్తున్న సమయంలో డ్రైవర్‌తో మాట్లాడారు. ఆ వీడియోను తర్వాత సోషల్ మీడియాలో పంచుకున్నారు. సంభాషణలో భాగంగా డ్రైవర్ గతంలో నెలకు రూ.25 వేల జీతంతో ఉద్యోగం చేసేవాడినని చెప్పాడు. ప్రస్తుతం క్యాబ్ నడపడం ద్వారా అంతకంటే ఎక్కువ ఆదాయం వస్తోందని వివరించాడు. 

దీనిపై స్పందించిన ఆకాష్ గుప్తా, నెలకు దాదాపు రూ.లక్ష రూపాయల వరకు సంపాదించే అవకాశం ఉండటమే ఉద్యోగం వదిలేయడానికి కారణమా అని ప్రశ్నించగా డ్రైవర్ చిరునవ్వుతో అంగీకరించాడు. అనంతరం గుప్తా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కేవలం క్యాబ్ డ్రైవర్ అని భావించొద్దని, నిజానికి ఒక వ్యాపారవేత్తగా తనను తాను చూడాలని సూచించారు. తాను నడుపుతున్న వాహనమే తన వ్యాపారమని, రోజుకు సుమారు 10 గంటలు పనిచేస్తూ రూ.3 వేల నుంచి రూ.4 వేల వరకు సంపాదిస్తున్నాడని చెప్పారు.

ఈ వీడియోను షేర్‌ చేస్తూ గిగ్ ఎకానమీలో పనిచేసే వారు భారతదేశ కొత్త మధ్యతరగతిగా ఎదుగుతున్నారని గుప్తా పేర్కొన్నారు. వీరు కేవలం డెలివరీ భాగస్వాములు, డ్రైవర్లు మాత్రమే కాదని.. స్వయం ఉపాధి ద్వారా ఆదాయం సృష్టించుకుంటున్న సూక్ష్మ వ్యాపారవేత్తలని అభిప్రాయపడ్డారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Akash Gupta
Zypp Electric
Cab driver income
Gig economy India
Micro entrepreneurs
Monthly income one lakh

More Telugu News